సజావుగా గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలి నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
మల్కాజ్గిరి, ఆగస్ట్ 23 (తెలంగాణ ముచ్చట్లు)
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు సౌకర్యం కల్పిస్తూ, ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
సీపీ మాట్లాడుతూ, మండపాల్లో డిజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాల్లో క్యూలైన్ల ఏర్పాటుతో భక్తుల రద్దీని నియంత్రించాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాలను విస్తృతంగా వినియోగించి విజిబుల్ పోలీసింగ్పై దృష్టి పెట్టాలని, డయల్ 100 కాల్స్కు తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు.
రౌడీ షీటర్లు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని సూచించారు. నిమజ్జనానికి చెరువులు, నీటి కుంటల వద్ద టెంట్లు, క్రేన్లు, ఫ్లడ్లైట్లు, మొబైల్ టాయిలెట్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, జిహెచ్ఎంసి, విద్యుత్, అగ్నిమాపక, నీటి పారుదల, రవాణా తదితర శాఖలతో సమన్వయం సాధించాలని ఆదేశించారు.
ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ అధికారులను తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో డీసీపీలు, ఏసీపీలు, సీసీఆర్బీ అధికారులు పాల్గొన్నారు.


Comments