స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర
పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నియోజకవర్గానికి ఇప్పటివరకు 900 కోట్లు తెచ్చిన విషయాన్ని వెల్లడింపు
-అవినీతి లేని పాలనకే కట్టుబడి ఉన్నానని స్పష్టం
ధర్మసాగర్,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపడుతున్న పనుల జాతర-2025 లో భాగంగా పలు అభివృద్ధి పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో 46 లక్షల రూపాయలతో, ఎస్సీపి నిధుల ద్వారా 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి, అలాగే ధర్మసాగర్ గ్రామంలో 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు శ్రీహరి ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 73 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ నియోజకవర్గం అంతా తిరుగుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తన రాజకీయ జీవితం అంతా అవినీతి లేని విధంగా కొనసాగించానని, ఒక్క రూపాయి లావాదేవీ నిరూపించగలిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. గతంలో ప్రజలు తమ ఎమ్మెల్యే గురించి చెప్పడానికి సిగ్గుపడాల్సి వచ్చేదని, కానీ తన పనితీరుతో మాత్రం గర్వంగా చెప్పుకునే స్థితి తీసుకొచ్చానని పేర్కొన్నారు.
శ్రీహరి మాట్లాడుతూ — నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు 900 కోట్ల రూపాయల నిధులు తెచ్చానని, ఇది సామాన్య విషయం కాదని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఇంత మొత్తంలో నిధులు రాలేదని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కక్షల వల్ల పెద్దపెండ్యాల గ్రామం నష్టపోయిందని, కానీ ఒక్క ఏడాది కాలంలోనే దాదాపు 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని వివరించారు. త్వరలోనే పెద్దపెండ్యాల–చిన్నపెండ్యాల రహదారి నిర్మాణం, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధర్మసాగర్ మోడల్ కాలనీలో 50 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందని, లబ్ధిదారులకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా బిల్లులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రేషన్ షాప్ల ద్వారా పేద కుటుంబాలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు అదనపు పేర్ల చేర్పులు జరిగాయని, కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ నుంచే సన్నబియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక, 9 రోజుల్లోనే 65 లక్షల మంది రైతులకు 9 వేల కోట్లు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments