బొల్లారం కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా ముగిసిన 54వ జాతీయ క్రీడోత్సవాలు
సికింద్రాబాద్, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):
సికింద్రాబాద్ బొల్లారం పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఐదు రోజులపాటు జరిగిన 54వ జాతీయ క్రీడోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఈ క్రీడలలో 14, 17, 19 ఏళ్ల వయస్సులోపు బాలికల కోసం ఆర్చరీ, విలువిద్య వంటి పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వీణా అనిల్ కుమార్ రోటే మాట్లాడుతూ, ఈనెల 19 నుంచి 23 వరకు జరిగిన ఈ క్రీడలలో దేశవ్యాప్తంగా 20 రీజియన్లకు చెందిన 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థినుల కోసం పాఠశాల ఆవాస సదుపాయాలను కూడా కల్పించినట్లు పేర్కొన్నారు.
ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ హెప్టాథ్లాన్ అథ్లెట్ అగసర నందిని ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇందులో చెన్నై రీజియన్ ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, "క్రీడల్లో గెలవడం మాత్రమే కాదు, పాల్గొనడం కూడా అంతే ముఖ్యమైందని, గెలుపు సాధించేందుకు కృషి చేయాలని" ప్రోత్సహించారు.
కార్యక్రమంలో పి.జి.టి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీరాయప్ప తదితరులు పాల్గొన్నారు.


Comments