సత్తుపల్లిలో గణపతి పూజల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు.
భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణం అంతా గణపతి నవరాత్రుల సంబరాలతో కళకళలాడింది. గలగల మేళతాళాలు, గాజుల మోగింపు, వినాయక భజనలు, శంఖధ్వనులు, హరతుల కాంతులతో పట్టణం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్బంగా బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ దంపతులు పట్టణంలోని వివిధ గణపతి మండపాల్లో పూజల్లో పాల్గొన్నారు.
మొదటగా ద్వారకాపూరి కాలనీలోని ఎమ్మెల్యే శిబిర కార్యాలయంలో గణపతి పూజ నిర్వహించారు. భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
తదుపరి కోదండరామాలయం సన్నిధిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయి ఘనంగా సాగిన పూజల్లో పాల్గొని, భక్తులతో కలసి ప్రసాదాన్ని స్వీకరించారు.
జలగం పార్కు ఎదుట ఉన్న ప్రసన్న గణపతి మండపంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేసి, అనంతరం అన్నప్రసాదంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై “గణపతి బప్పా మోరియా” నినాదాలతో మండపాన్ని మార్మోగించారు. అదే విధంగా జలగం పార్కు వద్ద డబుల్ బెడ్ రూం కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులు కాలనీవాసులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమాల్లో దోమ ఆనంద్, గాదె చెన్నారావు, గ్యాస్ సత్యనారాయణ, శ్రీధర్, చల్లగుళ్ల నరసింహరావు, కమల్ పాషా, గణేష్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు, భక్తులు పాల్గొని గణపతి నవరాత్రులను విజయవంతం చేశారు.
సత్తుపల్లి పట్టణం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో గణపతి నవరాత్రులను జరుపుకుంటుండగా, ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో భక్తులు మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయం, భక్తి, ఉత్సాహం కలిసిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దంపతుల పాల్గొనడం ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.


Comments