గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
మహేశ్వరం, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
రంగారెడ్డి జిల్లా, కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ విభాగాధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష చేపట్టారు.రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్, ఐజీపీ రమేష్ రెడ్డి ఐపీఎస్తో కలిసి మహేష్ భగవత్ సమ్మిట్ జరగనున్న ప్రాంగణాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ సమ్మిట్ సందర్భంగా బందోబస్త్ విషయంలో ఎటువంటి లోపం చోటుచేసుకోకుండా అధికారులు పరస్పర సమన్వయం తో పని చేయాలని ఆదేశించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమ్మిట్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ వంటి విభాగాలతో కలిపి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు.
సమ్మిట్కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు, బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాల ప్రతినిధులు కలిసి సుమారు 600 మంది డెలిగేట్లు పాల్గొననున్నట్టు అధికారులు వివరించారు. వీరికి మూడంచెల భద్రత కల్పించను న్నారు.సమ్మిట్ ప్రాంగణంలో వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్తో అనుసంధానించనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులు, అదనంగా ట్రాఫిక్ మార్షల్స్ను నియమించనున్నారు. రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహన పార్కింగ్ నిర్వహణ వంటి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.సమ్మిట్ రోజుల్లో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆయా మార్గాల్లో ప్రత్యేక రూట్ డైవర్షన్లు అమలు చేసి పటిష్టమైన పోలీసు బందోబస్తును అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.


Comments