టి–రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారీ బందోబస్తు
రాచకొండ సిపి జి. సుధీర్ బాబు
మహేశ్వరం, నవంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టి–రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లలో మునిగింది. శుక్రవారం మహేశ్వరంలో రాచకొండ సిపి జి. సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ఐసీసీ శశాంక్, మిర్ఖాన్ పేట డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తదితరులు సమన్వయ సమావేశం నిర్వహించి, సమ్మిట్ నిర్వహణ కమిటీ సభ్యులతో భద్రత, మౌలిక వసతులపై చర్చించారు.సమ్మిట్ కోసం సుమారు 2,500 మంది పోలీస్ బలగాలు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్ వంటి విభాగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సమ్మిట్ ప్రాంతంలో వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,000 మంది ట్రాఫిక్ పోలీసులు, రహదారుల మళ్లింపు, రూట్ మ్యాప్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ నిర్వహణ కోసం ట్రాఫిక్ మార్షల్స్ నియమించబడ్డారు. రెండు రోజులపాటు సాధారణ ప్రజలు, వాహనదారులు సౌకర్యం పొందేలా మార్గాలు మళ్లింపు చర్యలతో అందుబాటులో ఉంటాయి.సమ్మిట్కు సుమారు 600 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు. వీరి సహాయక సిబ్బంది మూడు వేల మందికి పైగా ఉంటారు. మహిళా పారిశ్రామికవేత్తల, వక్తల, పెట్టుబడిదారుల భద్రత కోసం ఉమెన్స్ వింగ్, షీ టీమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.రాజ్యాధికారుల సమన్వయంతో, సమ్మిట్ ప్రాంతంలో బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉంటాయి. ఈ ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ సాఫీగా నిర్వహించడానికి కీలకం అవుతున్నాయి.


Comments