గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.గురువారం నంది హిల్స్లోని తన నివాస కార్యాలయంలో పెబ్బేరు, శ్రీరంగాపురం, అడ్డాకుల మండలాల్లో మూడో విడతలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా, నీచ రాజకీయాలు చేసినా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు, కాంగ్రెస్ పార్టీ తరఫున స్వతంత్రులుగా (రెబల్స్గా) నిలబడిన అభ్యర్థులకు సైతం అధిక సంఖ్యలో ఓట్లు పడటం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని పేర్కొన్నారు.గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత కరెంటు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, సన్న బియ్యం పంపిణీ, విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు, వసతి గృహాల్లో మెరుగైన భోజన వసతులు, మెరుగైన వైద్య సదుపాయాలు, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రుణమాఫీ వంటి అనేక పథకాల ద్వారా గ్రామాల్లోని పేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని తెలిపారు.ప్రస్తుతం విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించేలా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని, ప్రతి ఒక్కరికీ తాను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments