కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు
కార్పొరేటర్ బొంతు శ్రీదేవిపై ఆరోపణలు
కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి విమర్శ
కుషాయిగూడ, డిసెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
జీహెచ్ఎంసీ 16వ డివిజన్ను కుషాయిగూడ డివిజన్గా ఏర్పాటు కాకుండా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కుట్రలు, కుతంత్రాలు చేశారని కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. డివిజన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతూ “వసూల్ రాణి”గా అవతారం ఎత్తారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు దాదాపు ఖరారైన నేపథ్యంలో గురువారం కుషాయిగూడ బస్టాండ్ ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు.ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చర్లపల్లి డివిజన్లో దోపిడీ సరిపోక కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 80 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నా వదలకుండా లక్షల రూపాయలు కప్పంగా వసూలు చేశారని, గుడిలో అర్చకత్వం చేసే పురోహితులను కూడా వదలలేదని అన్నారు. లక్ష్మీనరసింహ కాలనీలో పేద యాదవ కుటుంబం నుంచి సుమారు రూ.75 వేల వరకు వసూలు చేసిన ఘటనను గుర్తు చేశారు.వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన కుషాయిగూడ ప్రాంతాన్ని పదేళ్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఇకనైనా కుట్రలు మానకపోతే చాయ్పే చర్చ కార్యక్రమాలతో ముందుకు సాగుతూ అవినీతి బండారాన్ని సాక్షాధారాలతో బయటపెడతామని హెచ్చరించారు.చర్లపల్లి కాలనీల సమాఖ్య (సీసీఎస్) అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి మాట్లాడుతూ, ఒకవైపు కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మరోవైపు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు.ఈ సమావేశంలో ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్తో పాటు వివిధ కాలనీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments