ప్రశాంతంగా కొనసాగిన ఓట్ల పండుగ
ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
రాచకొండ, డిసెంబర్ 17 ( తెలంగాణ ముచ్చట్లు):
మూడో తుదివిడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మంచాల మండలంలోని అఘపల్లి గ్రామంలో జరుగుతున్న పోలింగ్ సరళిని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలింగ్ పూర్తయ్యి ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాచకొండ పరిధిలో భువనగిరి నియోజకవర్గంలోని గుండాల, మోటకొండూరు, చౌటుప్పల్, నారాయణపూర్, మోత్కూర్, అడ్డగూడూరు, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల్, గ్రీన్ ఫార్మా, మాడ్గుల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయని సీపీ తెలిపారు.ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో బిఎన్ఎస్ 163 (144 సెక్షన్) అమలులో ఉందని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నలుగురికి మించి గుమిగూడరాదని స్పష్టం చేశారు.చిన్న సంఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని పోలీసు సిబ్బందిని సీపీ సుధీర్ బాబు ఆదేశించారు.


Comments