ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం స్పెషల్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే బండారి
నాచారం, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల లోపాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ బి. అజిత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల కొరత, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఆయన వివరించారు. అలాగే కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించేందుకు వంట గదుల కొరత, మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అన్నపూర్ణ కాలనీలోని వెస్లీ హైస్కూల్ ఎయిడెడ్ పాఠశాలను పూర్తి స్థాయి ప్రభుత్వ పాఠశాలగా మార్పు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ పాఠశాల భవనం అనేక సంవత్సరాల క్రితం నిర్మించబడినదని, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నందున ఆ భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సమస్యలను ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పెషల్ సెక్రెటరీని కలిసి పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, బీఆర్ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షులు బైరి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments