విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అత్యవసరం.!
ప్రముఖ విద్యావేత్త లక్కినేని ప్రసాద్.
సత్తుపల్లి, డిసెంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ సంస్కృతి, మహనీయుల చరిత్ర, మానవతా విలువలను నేటి తరానికి చేరవేయడం అత్యంత అవసరమని ప్రముఖ విద్యావేత్త లక్కినేని ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం సత్తుపల్లి డివిజన్ పరిధిలోని పలు పాఠశాలలకు విలువల విద్యను పెంపొందించే 100 పుస్తకాలతో కూడిన ప్రత్యేక గ్రంథ బండిల్స్ను ఆయన అందజేశారు. భారతదేశ చరిత్రను శోభింపజేసిన మహనీయుల జీవిత చరిత్రలు, వారసత్వాన్ని ప్రతిబింబించే పుస్తకాలను సరళమైన భాషలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఈ సందర్భంగా ప్రసాద్ తెలిపారు.
ఈ కిట్లలో రాణి రుద్రమదేవి, 1000 పేజీల మహా రచన ‘వేయి పడగలు’తో పేరెన్నికగన్న విశ్వనాథ సత్యనారాయణ, స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఉక్కుమనిషి సర్దార్ పటేల్, విద్యోద్యమ పితామహుడు జ్యోతిరావు పూలే, సామాజిక మార్పు కొరకు కృషిచేసిన కందుకూరి వీరేశలింగం, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, ఋషి రమణ మహర్షి, విప్లవ వీరుడు వీర సవర్కర్, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీర మరణం పొందిన కుదిరంబోస్, చత్రపతి శివాజీ, చాణక్య, అశోకుడు, స్వామి రామానంద తీర్థ తదితర 60 మంది ప్రముఖుల జీవిత చరిత్రలు ఉన్నాయి. అదేవిధంగా భారత చిన్నకథలు, మన వారసత్వం, ఆరోగ్య అవగాహన గ్రంథాలు, వేమన–కృష్ణ–సుమతి–భాస్కర శతకాలు, ‘ఉజ్వల వైజ్ఞానిక పరంపర’, ‘108 నిజాలు – భారతీయ ప్రతిభ విశేషాలు’ వంటి పుస్తకాలు కూడా విద్యార్థులకు అందజేశారు. విలువలతో కూడిన విద్యాభివృద్ధికి ఈ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని లక్కినేని ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments