మహిళల సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా
పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు చీరలను పంపిణీ చేయడం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి తెలిపారు.శుక్రవారం పెద్దమందడి మండలంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మెఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెఘా రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాలకు 89 వేల పైచిలుకు చీరలు, మున్సిపాలిటీలకు మరో 40 వేల చీరలు పంపిణీకి వచ్చాయని,18 ఏళ్లు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ఉచిత చీర అందజేయనున్నట్టు తెలిపారు.మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రోజున మొదటి సంతకం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికే జరిగిందని గుర్తుచేశారు. మహిళలను ఆర్థికంగా బలపర్చేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి కాంటీన్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తెల్లరేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.గ్రామీణ ప్రాంతాల మహిళలు పట్టణాలకు వచ్చినప్పుడు సేదతీరేందుకు రూ. 5 కోట్ల వ్యయంతో వనపర్తిలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం జరుగుతోందని, త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలం అభివృద్ధి తన బాధ్యతగా తీసుకుని రోడ్ల నిర్మాణంతో పాటు వివిధ మౌలిక సదుపాయాలను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను అత్యంత బాధ్యతతో తిరిగి చెల్లిస్తున్నందువల్లనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి రుణాలు అందించే అవకాశం లభిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 105 మంది మహిళలకు ఇళ్లు నిర్మించేందుకు రుణాలు ఇవ్వబడ్డాయని తెలిపారు. అవసరమైన వారు మహిళా సంఘాల ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.పెబ్బేరులో మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్, వనపర్తిలో మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తికానున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, నాయకులు కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


Comments