ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ ఇండియా అనుబంధ కేంద్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తాం
సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ–ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు తమకు అనుకూలంగా స్వంత భవనాలను నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని తెలిపారు.
తెలంగాణ–నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్
“సంస్కృతుల సంగమం – సమృద్ధికి సోపానం” పేరిట హైదరాబాద్లో ప్రారంభమైన ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, గవర్నర్ సతీమణి సుధా దేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలో తొలి “నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం” నిర్మాణ పనులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నాయకత్వం వహించాలని కోరారు. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు ఎనిమిది రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం సమిష్టిగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
అస్సోం, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు ఈ కేంద్రంలో హాస్టల్ సౌకర్యాలు, ఆహారం, కళలు, సంస్కృతి, చేతివృత్తులు, ప్రదర్శన వేదికలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
త్రిపురకు చెందిన జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా, తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులైన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే బలమైన సంబంధాలు నెలకొన్నాయని సీఎం తెలిపారు.
ఈ ఉత్సవాలు తెలంగాణ–ఈశాన్య రాష్ట్రాల సంస్కృతుల పరస్పర మార్పిడికి నాంది కావడంతో పాటు ఐక్యత స్ఫూర్తిని చాటుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణను రెండో ఇల్లుగా భావించే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఐటీ, ఫార్మా, హెల్త్కేర్, హాస్పిటాలిటీ, స్టార్టప్, క్రీడలు వంటి రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ ఇప్పటికే దేశంలో పెట్టుబడుల ప్రధాన గమ్యస్థానమైందని, చైనా ప్లస్ వన్ వ్యూహంలో తెలంగాణను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.రాష్ట్ర అభివృద్ధికి రూపుదిద్దుకున్న తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాలను ప్రపంచమంతటికి తీసుకువెళ్లేందుకు ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధుల సహకారం అవసరమని సీఎం అన్నారు. డిసెంబర్ 8–9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు గవర్నర్ సహకారం కోరారు.ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కళాకారులను సత్కరించారు.




Comments