మంత్రి పొంగులేటి స్వగ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం.!
పార్టీలకతీత నిర్ణయం… కాంగ్రెస్ అభ్యర్థికే సంపూర్ణ మద్దతు.
కల్లూరు, డిసెంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మూడో విడతలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో నామినేషన్లు పరిశీలించగా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఒక్కరే బరిలో నిలవడంతో పోటీ లేకుండానే ఎన్నిక పూర్తయింది. ఎస్సీ జనరల్కు రిజర్వ్ చేసిన ఈ స్థానానికి గ్రామ పెద్దలు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలను పక్కనబెట్టి గ్రామాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని ఒకే నిర్ణయానికి రావడం విశేషంగా మారింది. ఈ ఏకగ్రీవానికి మంత్రి సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమన్వయం ప్రముఖ పాత్ర పోషించినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే చర్చా వేదికపైకి తీసుకొచ్చి అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని నెలకొల్పారు. దీంతో పంచాయతీలో శాంతియుత వాతావరణం నెలకొనడమే కాక, పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఏర్పడే మార్గం సుగమమైంది.
ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటేశ్వర్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రసాద్ రెడ్డి అభినందించారు. నారాయణపురం అభివృద్ధి దిశగా ఇది శుభ సూచికమని మంత్రి పేర్కొన్నారు. స్వగ్రామంలో ఏకగ్రీవం సాధ్యం కావడంతో గ్రామస్థులు, కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వెల్లివిరిసింది.


Comments