విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలగాటం.
వరంగల్ ఎంపీ కడియం కావ్య.
హన్మకొండ,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై విద్యార్థులకు మద్దతుగా హనుమకొండలో నిర్వహించిన భారీ కాగడా ర్యాలీలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ర్యాలీ అనంతరం నీట్ ప్రశ్నాపత్ర లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు క్యాండిళ్లు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కడియం కావ్య మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల విద్యా హక్కులను పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.
నీట్, జేఈఈ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా వెలుగుచూస్తున్న అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల ఆశలను ఛిద్రము చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించిన ఆమె, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గుండు సుధారాణి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments