గోపాల్పూర్ గుడిసెవాసులకు ఇండ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలి.
హన్మకొండ,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
గోపాల్పూర్ గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు పొందిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీలను విస్మరించిందని ఆరోపించారు.గోపాల్పూర్ చెరువులో సరైన రక్షణ చర్యలు లేకపోయినా మట్టి, మొరంను అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారని, దీనిపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చెరువు సమీపంలోని రక్షణ గోడ దెబ్బతింటే దాదాపు 18 కాలనీలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వడ్డేపల్లి చెరువు నుంచి తులసి బార్ వరకు ఉన్న కాలువకు బలమైన రక్షణ గోడ నిర్మించాలని, గత వరదల్లో దెబ్బతిన్న కాలువను ఇప్పటికీ పునరుద్ధరించకపోవడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందన్నారు. తులసి బార్ నుంచి సమ్మె నగర్ వరకు కూలిపోయిన కాలువ గోడలను వెంటనే మరమ్మతు చేయాలని, కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు.
పేదల హక్కుల కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు, మరో భూ పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. జూన్ 27న ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే నిరసన ర్యాలీలో వామపక్ష పార్టీలతో పాటు అన్ని గుడిసెవాసుల సంఘాలు పాల్గొంటాయని తెలిపారు.
ఇండ్ల స్థలాలు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని, పేదల ఐక్యతతోనే ప్రభుత్వాలను ప్రశ్నించగలమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలంతా ఏకమై తమ హక్కుల సాధన కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం హనుమకొండ మండల కార్యదర్శి వీరన్న, డీవైఎఫ్ఐ నాయకురాలు దీప, నాయకులు రవీందర్, రాజు, రాధిక, స్వప్న, సబిత, పావని, శృతి, పద్మ, సమ్మయ్య, రాధా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments