హాస్టల్ కోసం విద్యార్థినుల ఆవేదన!
- సత్తుపల్లి సర్కారోళ్ల హాస్టల్ దుస్థితి.
- 24 మందికి ఉద్దేశించిన గదుల్లో 60 మంది.. రోజూ 3 కి.మీ. నడక.
- స్లాబ్ పెచ్చులు ఊడిపడతాయనే భయంతో చదువులు.
సత్తుపల్లి, జూన్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి ప్రభుత్వ కళాశాలల్లో విద్యాభ్యాసం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎస్సీ విద్యార్థినులు తీవ్ర వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం శిథిలావస్థకు చేరి కూలిపోయిన సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహానికి ఇప్పటికీ శాశ్వత భవనం ఏర్పాటు కాకపోవడంతో తాత్కాలిక వసతుల్లోనే కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం స్థానిక సాంఘిక సంక్షేమ పాఠశాల వసతి గృహంలో 24 మందికి మాత్రమే సరిపడే రెండు గదుల్లో సుమారు 60 మంది విద్యార్థినులు నివసిస్తున్నట్లు వారు తెలిపారు. స్థలాభావంతో పాటు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్, ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థినులు హాస్టల్ నుంచి బస్టాండ్ వరకు ప్రతిరోజూ సుమారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. వర్షాకాలంలో గదుల స్లాబ్ నుంచి నీరు కారడంతో పాటు పెచ్చులు ఊడిపడతాయేమోనన్న భయంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. సత్తుపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జేవీఆర్ డిగ్రీ కళాశాలతో పాటు ఇతర విద్యాసంస్థల్లో చదువుకునేందుకు ప్రతి ఏడాది వందలాది మంది ఎస్సీ విద్యార్థినులు వస్తున్నప్పటికీ, వారికి తగిన వసతి గృహం లేకపోవడం వల్ల కొందరు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. శాశ్వత ప్రభుత్వ వసతి గృహం నిర్మించే వరకు కనీసం అద్దె భవనంలోనైనా హాస్టల్ ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు ప్ర
భుత్వాన్ని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చొరవ తీసుకుని శాశ్వత భవనం మంజూరు చేయించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.


Comments