మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.
జమ్మికుంట టౌన్ జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన గుండా సురేందర్ ఇటీవల గుండెపోటు, వడదెబ్బ కారణంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు జమ్మికుంట జెడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 పదవ తరగతి బ్యాచ్కు చెందిన బాల్యమిత్రులు ముందుకు వచ్చారు.
సురేందర్తో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు తమ వంతు సహాయంగా రూ.1 లక్షలను సమకూర్చి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని మృతి చెందిన సురేందర్ కుమార్తె పేరుతో స్థిర నిక్షేపంగా జమ చేశారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవడం నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. "స్నేహమే జీవితం" అనే భావనతో తమ బృందం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటుందని, సురేందర్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బాల్యమిత్రుల సేవాసమితి సభ్యులు మంద వెంకట్ రెడ్డి, కనుమల్ల గణపతి, ఆర్. సంపత్ కుమార్, పెంచలయ్య, కొక్కుల రాజేందర్, డి. రాజేందర్, సాంబయ్య, సమ్మయ్య, గుడిమల్ల బలరాం, ఎ. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments