పొలంలో మంటలు వ్యాపించి వ్యవసాయ గుడిసె దగ్ధం.
ధర్మసాగర్, జూన్ 13(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ఉన్న కోయకాలకు నిప్పు పెట్టగా మంటలు అదుపుతప్పి వేగంగా వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న నమిండ్ల వీరస్వామికి చెందిన వ్యవసాయ గుడిసెకు మంటలు అంటుకున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న వ్యవసాయ పనిముట్లు, పరికరాలు మరియు ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు వీరస్వామి తెలిపారు. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, వారు స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో జరిగిన ఈ ఘటన రైతుల్లో ఆందోళన కలిగించింది. కోయకాలు తగలబెట్టే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.


Comments