మృతుడి పిల్లల చదువులకు చేయూత.. రూ.1.36 లక్షల విద్యా సహాయ నిధి అందజేత.
జమ్మికుంట టౌన్ జూన్ 21(తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వీధికి చెందిన ఆడెపు లక్ష్మణ్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మృతుడి పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో స్థానిక వేద పండితులు డింగరి హరికృష్ణ ఆచార్యులు, వ్యాపారవేత్త గర్రెపల్లి అరుణ్ ఆధ్వర్యంలోని శ్రీ మార్కండేయ గ్రూప్ సహకారంతో దాతల నుంచి విద్యా సహాయ నిధిని సేకరించారు.
దాతల సహకారంతో మొత్తం రూ.1,36,000 నిధి సమకూరగా, ఆదివారం మృతుడి భార్య కావ్య, కుమారుడు కార్తీక్, కుమార్తె సాహితికి అందజేశారు. ఇందులో కుమార్తె సాహితి పేరిట రూ.1 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను, రూ.36 వేల నగదును కుటుంబ సభ్యులకు అందించారు.
ప్రస్తుతం సాహితి బీటెక్ రెండవ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు కార్తీక్ 9వ తరగతి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మణ్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం కష్టాల్లో పడిన నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి సహాయం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డింగరి హరికృష్ణ ఆచార్యులు, గర్రెపల్లి అరుణ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా లక్ష్మణ్ కుటుంబానికి అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కేదారేశ్వర్, బచ్చు వీరలింగం, గుడిపాటి వీరారెడ్డి, అరుకాల వీరేశలింగం, విఠల్ దాస్, శ్యాంసుందర్, జి. బలరాం, బొద్దుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments