బడి బాట కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలి.
మాడుగుల అజిత్ కుమార్.
భీమదేవరపల్లి, జూన్ 17:( తెలంగాణ ముచ్చట్లు )
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "బడి బాట" కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలవాలని ముల్కనూర్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు, బీజేపీ మండల నాయకులు మాడుగుల అజిత్ కుమార్ అన్నారు.
ప్రజలు మాటల కంటే ఆచరణను ఎక్కువగా విశ్వసిస్తారని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ముందడుగు వేస్తే ప్రభుత్వ పాఠశాలలపై సాధారణ ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. దీనివల్ల విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.
ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారనే భావన ఏర్పడితే పాఠశాలల అభివృద్ధిపై అధికారులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజల దృష్టి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ విద్య, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల హాజరు వంటి అంశాల్లో మరింత బాధ్యతతో చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు
దీనివల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాను చేసిన ఈ సూచన ఎవరినీ ఉద్దేశించి కాదని, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరగాలని, "బడి బాట" కార్యక్రమం విజయవంతమై ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో చేసిన సానుకూల ఆలోచన మాత్రమేనని మాడుగుల అజిత్ కుమార్ స్పష్టం చేశారు.


Comments