ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!
అధికారులతో ఎమ్మెల్యే రాగమయి సమీక్ష.
సత్తుపల్లి, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని, పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ప్రజా దర్బార్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశించారు. మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి, వేంసూరు మండలాల అధికారులతో ఆమె విడివిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సత్తుపల్లి మండల రెవెన్యూ అధికారులు, ఆర్ఐలు, జీపీవోలతో సమావేశమైన ఎమ్మెల్యే గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శులు, జీపీవోలు, హౌసింగ్ ఏఈల పనితీరును సమీక్షించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హుల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం వేంసూరు మండల ఎంఆర్వో, ఎంపీడీవో, ఎంఈఓ తదితర అధికారులతో సమావేశమై గ్రామాల వారీగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. కొంతమంది అధికారుల అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను ప్రాధాన్యంగా తీసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బడిబాట కార్యక్రమం, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, విద్యా బోధన అంశాలపై ఎంఈఓతో చర్చించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజా సమస్యలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


Comments