ఎల్కతుర్తికి గర్వకారణం జాతీయ పోటీలకు ఎంపికైన ఆమ్రిన్.
ఎల్కతుర్తి జూన్16(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన యువ బాక్సర్ మహ్మద్ ఆమ్రిన్ జాతీయ స్థాయి అండర్-15 బాక్సింగ్ పోటీలకు ఎంపికై మండలానికి గర్వకారణంగా నిలిచింది. మహ్మద్ హుస్సేన్, యకుబీ దంపతుల కుమార్తె అయిన ఆమ్రిన్ చిన్ననాటి నుంచే బాక్సింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకుని కఠోర సాధనతో ముందుకు సాగుతోంది.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమ్రిన్, ఇటీవల హైదరాబాద్లోని గౌలిపురలో మిత్రా వారియర్స్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హతను దక్కించుకుంది.
ఆమ్రిన్ సాధించిన ఈ ఘనత పట్ల ఆమె కోచ్ దేవరకొండ ప్రభుదాస్ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతోనే ఈ స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు.
జూన్ 20, 21 తేదీలలో పంజాబ్లో జరగనున్న జాతీయ స్థాయి అండర్-15 బాక్సింగ్ పోటీల్లో ఆమ్రిన్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా ఆమ్రిన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొంది. ప్రభుత్వం, క్రీడా శాఖ నుంచి ప్రోత్సాహం అందితే మరింత ఉన్నత స్థాయిలో రాణించగలనని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆమ్రిన్ ఎంపిక పట్ల ఎల్కతుర్తి మండల ప్రజలు, క్రీడాభిమానులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదుగుతున్నారనేందుకు ఆమ్రిన్ విజయం నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Comments