బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.
అడ్డాకల్, జూన్15(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామంలో ఆర్టీఐ ద్వారా చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గ్రామ సర్పంచ్ కోట్ల కరుణాకర్ రెడ్డి, రైతులు, మహిళలు స్పష్టం చేశారు. మంగళవారం ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ముఖాముఖిలో వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మహిళా సంఘాలు, వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు.వరి కొనుగోళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని రైతులు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు సక్రమంగా జమయ్యాయని, ఎలాంటి అక్రమాలకు తావులేదని వివరించారు.అలాగే గ్రామ మహిళా సంఘాల నిర్వహణలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదని మహిళలు తెలిపారు.కొందరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో గ్రామ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు.గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సామాజిక మాధ్యమాలు మరియు ఇతర వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేయకుండా గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.


Comments