వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు .
కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన బిఆర్ఎస్ నాయకులు .
కాజీపేట్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు)
రాజకీయ నాయకులు తమ స్వార్థం కొరకు కాజీపేట్ లోని వైయస్సార్ నగర్ లో నివాసం ఉంటున్న పేదల గుడిసెలను ఖాళీ చేయించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సోమవారం బి ఆర్ఎస్ నాయకులు గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్ల గిరి రమేష్, సుంచు కృష్ణ, మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావులు మాట్లాడుతూ వైయస్సార్ నగర్ భూములపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల కన్ను పడిందని గుడిసె వాసులను అక్కడి నుండి వెళ్లగొట్టేందుకు బలవంతపు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని వారు ఆరోపించారు. గుడిసెలను తొలగించే చర్యల వెనుక భారీ భూ వ్యవహారం ఉన్నాయని అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే పేరును ప్రస్తావిస్తూ నాయకులు పలు ఆరోపణలు చేశారు. గుడిసె వాసులకు అదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. మిగిలిన స్థానంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏసిపి కార్యాలయం, ఐటిఐ, ఎమ్మార్వో కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయ సముదాయాలను నిర్మించాలని కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. గుడిసె వాసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి బలవంతపు ఖాళీ చేయించే చర్యలు చేపట్ట రాదని వారు కోరారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం త్వరగా స్పందించి తగిన చర్య తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, పాలడుగుల శివకుమార్, పాము రాజేష్ ,ఎండి అఫ్జల్ పాషా, బెదరకోట రంజిత్ ,తండమల్ల వేణు, నీరటి పావని, గబ్బెట కరుణ్ మంద శ్రీనివాస్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.


Comments