న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ.
జమ్మికుంట టౌన్ జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలకు మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, రెండో పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించి కేటగిరీ వారీగా వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్మికులకు రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయడంతో పాటు శానిటేషన్, వాటర్వర్క్స్, హరితహారం, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రక్షణ పరికరాలు అందజేయాలని సూచించారు.
మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్లు, జవాన్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే డ్రైవర్ కేటగిరీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ వంతు సహకారం అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, ఫిరోజ్, మంద రాజేష్, శంకర్తో పాటు మున్సిపల్ కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


Comments