అటవీ–రెవెన్యూ భూముల సరిహద్దులపై స్పష్టతకు చర్యలు!
భవిష్యత్ భూవివాదాల నివారణే జాయింట్ సర్వే లక్ష్యమన్న కలెక్టర్ అంకిత్.
దమ్మపేట, జూన్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, నాన్-క్యాడస్ట్రల్ సర్వేతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం దమ్మపేట మండలంలోని అక్కినేపల్లి, లింగంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా అక్కినేపల్లిలో చేపడుతున్న నాన్-క్యాడస్ట్రల్ సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్, భూముల హద్దుల నిర్ధారణ, రికార్డుల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేను నాణ్యత ప్రమాణాలతో, పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తర్వాత లింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1458లో జరుగుతున్న ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వేను పరిశీలించారు. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భూముల సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని, నిర్ణీత గడువులో సర్వేను పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. అక్కినేపల్లి గ్రామ పరిధిలో సుమారు 4,400 ఎకరాల్లో జాయింట్ సర్వే కొనసాగుతోందని, మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్, సీతారామ ప్రాజెక్టు అలైన్మెంట్ను మ్యాప్ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, సర్వే, సరిహద్దుల నిర్ధారణ పనులను వేగవంతం చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే ద్వారా అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులు స్పష్టమవడంతో పాటు భవిష్యత్తులో భూవివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సర్వే, భూసేకరణ ప్రక్రియలను గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, దమ్మపేట తహసీల్దార్ రామ్ నరేష్, ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు, సర్వేయర్ నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments