వరుస చోరీలకు తెరదించిన పోలీసులు.
- ఏపీ–తెలంగాణలో చోరీలకు పాల్పడిన నలుగురు అరెస్ట్.
- ఇద్దరి కోసం గాలింపు.
- ఏసీపీ వసుంధర యాదవ్.
సత్తుపల్లి, జూన్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం, ఏలూరు జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును వి.ఎం. బంజర పోలీసులు రట్టు చేశారు. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ శివారులోని ఓ తోటలో మాటువేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఏడు చోరీ కేసులను ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిలో లంకపల్లి గ్రామానికి చెందిన మాణికల వసంతరావు, మాణికల రమేష్, ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్ముగూడెం గ్రామానికి చెందిన పొన్నూరి కోటేశ్వరరావు, తుమ్మల శేఖర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి రెండు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు ముందుగా తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, అర్ధరాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించేవారు. ముఠాలో ఒకరు ఇంటి బయట కాపలా ఉండగా, మిగిలిన వారు చోరీకి పాల్పడేవారు. అనంతరం పొలాల గుండా తప్పించుకునేవారు. ఈ ముఠా ఏలూరు జిల్లా చిన్నంపేటతో పాటు ఖమ్మం జిల్లా దుద్దెపూడి, సత్తుపల్లి, లంకపల్లి, కందుకూరు, అడవిమల్లెల గ్రామాల్లో మొత్తం ఏడు చోరీ కేసులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ కేసుల్లో లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, హుండీ సొమ్మును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితులను సత్తుపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. వీరిపై గతంలోనూ పలు దొంగతనం కేసులు నమోదై హిస్టరీ షీట్లు ఉన్నప్పటికీ నేరాలకు పాల్పడుతుండటంతో బీఎన్ఎస్ సెక్షన్ 111 (ఆర్గనైజ్డ్ క్రైమ్) తో పాటు పీడీ చట్టం కింద కూడా చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్నమరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని కల్లూరు డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు.


Comments