అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్.
హన్మకొండ,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు.
హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల పూడికతీత తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
టెండర్లు పూర్తయి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనసాగుతున్న పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన, ఉప డ్రైనేజీల పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన కలెక్టర్, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న గృహ, వాణిజ్య నల్లా కనెక్షన్లను నిర్ణీత గడువులో మంజూరు చేయాలని ఆదేశించారు.నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మహేందర్, మాధవి, సంజయ్తో పాటుఇతర అధికారులు పాల్గొన్నారు. 


Comments