జూన్ 25 నుంచి ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ.
బీఎల్వోలే పంపిణీ చేయాలి.. బహుళ ఓట్లపై కఠిన చర్యలు
-- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,జూన్23(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జూన్ 25 నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తహసీల్దార్లు, బీఎల్వోలు, సంబంధిత అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.ఎన్యూమరేషన్ ఫారాలను కేవలం బీఎల్వోలే పంపిణీ చేయాలని, ఇతరులు, ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ప్రక్రియలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఫారాల పంపిణీ సమయంలో బీఎల్వోలు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును వెంట ఉంచుకుని ప్రజలకు చూపించాలని సూచించారు.ఇంటికి తాళం వేసి ఉన్న పరిస్థితుల్లో సంబంధిత కుటుంబాన్ని సంప్రదించేందుకు కనీసం మూడుసార్లు వెళ్లాలని, అనంతరం ఫారాల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.జూలై 1 నాటికి ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసి, ప్రజలు పూరించిన ఫారాలను సేకరించి బీఎల్వో యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్ల జాబితాలో ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్వోలు, సూపర్వైజర్లకు సెలవులు మంజూరు చేయబోమని తెలిపారు.ఓటర్లలో అవగాహన పెంచేందుకు బుధవారం మండల కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన ర్యాలీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఓటర్ల జాబితా శుద్ధి ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.


Comments