బొగ్గు రవాణా.. అడుగడుగునా డిజిటల్ నిఘా.
- ఆర్ఎఫ్ఐడీ, జీపీఎస్, సీసీటీవీ, ఎస్ఏపీతో పారదర్శక వ్యవస్థ.
- చోరీ ఆరోపణలు వాస్తవం కావని స్పష్టం చేసిన సింగరేణి అధికారులు.

సత్తుపల్లి, జూన్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
సింగరేణిలో బొగ్గు రవాణా అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా జరుగుతోందని, బొగ్గు చోరీలకు ఆస్కారం లేదని సింగరేణి డైరెక్టర్ (పీ అండ్ పీ) కొప్పుల వెంకటేశ్వర్లు, సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వరకు ప్రతి టన్ను బొగ్గు ఆర్ఎఫ్ఐడీ, జీపీఎస్, సీసీటీవీ, ఎస్ఏపీ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణలోనే రవాణా అవుతోందని తెలిపారు. బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో చోరీలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని పేర్కొన్నారు. సింగరేణిలో ఉత్పత్తయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గంలో సరఫరా అవుతుందని వివరించారు. ఎస్ఏపీ ఆధారిత వ్యవస్థలో ముందుగానే బొగ్గు కేటాయింపులు జరుగుతాయని, వాహనాల తూకం, లోడింగ్, ఆర్ఎఫ్ఐడీ ఆధారిత బూమ్ బ్యారియర్లు, కంప్యూటర్ రూపొందించిన వే–బిల్లుల ద్వారా మాత్రమే వాహనాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అన్ని బొగ్గు రవాణా వాహనాలకు జీపీఎస్, జీపీఆర్ఎస్, జియో ఫెన్సింగ్ వ్యవస్థలు అమల్లో ఉన్నాయని, వాహనం నిర్ణీత మార్గం నుంచి మళ్లినా సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు వెళ్తాయని చెప్పారు. గనులు, సీహెచ్పీలు, వెయ్బ్రిడ్జిలు, రైల్వే సైడింగులు, స్టాక్యార్డులు, ప్రవేశ–నిష్క్రమణ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ బూమ్ బ్యారియర్లతో 24 గంటల నిఘా కొనసాగుతోందని వెల్లడించారు. అన్ని వెయ్బ్రిడ్జిలు కోల్నెట్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమై ఉండటంతో ప్రతి లారీ, ప్రతి రైల్వే వ్యాగన్ బరువు ఆన్లైన్లో నమోదవుతోందని, లోడింగ్, అన్లోడింగ్ సమయంలో తేడాలు ఉంటే సంబంధిత రవాణా కాంట్రాక్టర్ల నుంచి నష్టపరిహారం వసూలు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే మార్గంలో కూడా ఎస్ఏపీ ఆధారిత విధానంలో లోడింగ్ నిర్వహించి సమాచారం వెంటనే వినియోగదారులకు చేరవేస్తున్నట్లు చెప్పారు. చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, టాస్క్ఫోర్స్ బృందాల ద్వారా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆర్ఎఫ్ఐడీ, జీపీఎస్, సీసీటీవీ, ఎస్ఏపీ, కోల్నెట్, ఎలక్ట్రానిక్ వెయ్బ్రిడ్జిలు వంటి బహుళస్థాయి సాంకేతిక వ్యవస్థలతో ప్రతి టన్ను బొగ్గు రవాణా పూర్తిస్థాయి పర్యవేక్షణలోనే జరుగుతోందని తెలిపారు.


Comments