మానేరు పక్కనే ఉన్న ఇసుక కోసం ప్రజల నిరీక్షణ..
జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలి: మాజీ ఎంపీటీసీ దరుగుల రాకేష్
జమ్మికుంట టౌన్ జూన్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట (ఇల్లంతకుంట) మండలాల్లో నెలకొన్న ఇసుక కొరతను వెంటనే నివారించాలని మాజీ ఎంపీటీసీ దరుగుల రాకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, ఇళ్లు నిర్మించుకుంటున్న సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పాటు స్వంతంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న ప్రజలకు సకాలంలో ఇసుక అందుబాటులో ఉండేలా జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకృతి ప్రసాదమైన మానేరు వాగు సమీపంలో ఉన్న ఉమ్మడి జమ్మికుంట మండల ప్రజలకు ఇసుక దొరకకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
“గుండె నిండా పాలు ఉన్నా బిడ్డకు అందించలేని తల్లి పరిస్థితి రాకూడదు” అనే సామెతను ప్రస్తావిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉన్న సహజ వనరులను పారదర్శకంగా పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇసుక సరఫరాలో పారదర్శకత, సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని కోరారు.
ఇల్లు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వెంటనే స్పందించి ప్రజల సమస్యను పరిష్కరించాలని దరుగుల రాకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Comments