రిజర్వేషన్ల పరిరక్షణకు ఉద్యమించాలి.
దళిత బహుజన ఐక్యత అత్యవసరం
-బూర్గుల నాగేందర్ మాదిగ,
మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు
హైదరాబాద్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం(టిఎంజెఎఫ్)
వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత బూర్గుల నాగేందర్ మాదిగ పిలుపునిచ్చారు.హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్ హక్కులను నిర్వీర్యం చేసేందుకు పాలక వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.
అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న రిజర్వేషన్లను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా దళిత బహుజన ఐక్య ఉద్యమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. దళిత బహుజనులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాదిగ హక్కుల కోసం సాగుతున్న పోరాటానికి 32 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఈదుమూడిలో జూలై 7న నిర్వహించనున్న అమరవీరుల స్మారక కార్యక్రమానికి మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
కారంచేడు, చుండూరు, వేంపంట ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాల స్ఫూర్తితో రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.మాదిగ జర్నలిస్టు ఫోరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు మాదిగ ఉపకులాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఉద్యమాలు కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు సుంచు లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్, నాయకులు నలువాల మహారాయుడు, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.


Comments