పాఠశాల కాంపౌండ్ వాల్పై తిమ్మాపూర్లో వివాదం
ఎల్కతుర్తి, మార్చి 13:( తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద చేపడుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం వివాదానికి దారితీసింది. గ్రామ ప్రజలకు మరియు వార్డు సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ముప్పు మానస మహేందర్ ఈ నిర్మాణ పనులు ప్రారంభించారని గ్రామస్థులు ఆరోపించారు.
ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగితే పక్కనే ఉన్న ఇండ్లకు మరియు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఉన్న రాకపోక మార్గం మూసుకుపోయే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు కలగవచ్చని వారు తెలిపారు.
ఈ నేపథ్యంలో తిమ్మాపూర్ గ్రామ ప్రజలు మరియు వార్డు సభ్యులు కలిసి శుక్రవారం ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ప్రసాద్ రావుకు వినతిపత్రం సమర్పించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి, హద్దులు స్పష్టంగా నిర్ణయించి గ్రామ ప్రజలు తమ ఇండ్లకు మరియు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొలుగూరు రమేష్ బాబు, దామెర తరుణ్, చంద్రగిరి కుమారస్వామి, చంద్రగిరి ప్రశాంత్, గాజుల హరీష్, బండి రాజకుమార్, చిప్ప రామచందర్, గొల్ల రాకేష్, చంద్రగిరి అఖిల్, రాజయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Comments