నిజమైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం
--- పైరవీ కారులకు పట్టాలు ఇచ్చారు
--- రీ సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి
--- అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
--- విలేకరుల సమావేశంలో వెలుగుమట్ల భూదాన్ బాధితులు
ఖమ్మం బ్యూరో, మార్చి 12 (తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా, కొంతమంది అనర్హులకు, అక్రమార్కులకు, పైరవీకారులకు పట్టాలు పంపిణీ చేశారని, అసలైన బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని భూదాన్ భూముల బాధితులు పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భూదాన్ బాధితులు సత్యనారాయణ రెడ్డి, నరగాని కోటేశ్వరరావు, రవి, సీతారాములు, కళ్యాణి, కవిత, జయమ్మ లు మాట్లాడుతూ... 8 సంవత్సరాలుగా తాము వెలుగుమట్ల భూదాన్ భూములలో గుడిసెలు వేసుకుని, ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నామని, కొందరు వ్యక్తులు తమ వద్ద డబ్బులు వసూలు చేసి ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు హడావుడిగా, సక్రమంగా సర్వే చేయకుండా అసలైన లబ్ధిదారులను గుర్తించకుండా, కాలనీకి చెందని వారికి పట్టాలి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు..? ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా రాత్రింబవళ్లు చీకట్లో ఉండి పాములు, తేళ్ల మధ్య నివాసం గడిపి, నీళ్లు లేక, కరెంటు లేక అనేక ఇబ్బందులు పడ్డ తమలాంటి కుటుంబాలను గుర్తించకుండా అనర్హులను ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. సర్వం కూలిపోయి రోడ్డు పాలైన తమలాంటి వారికి అన్యాయం చేయటం సరైనది కాదన్నారు. మరొక్కసారి రీ సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిరికొండ కల్యాణి, గాదె భాగ్యలక్ష్మి, పసుమర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Comments