ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
_అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చ పెట్టాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతి
ఉప్పల్, మార్చి 13 ( తెలంగాణ ముచ్చట్లు):
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే. ఉన్నికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. పేదలకు వైద్య సేవలు అందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కు సరిపడా నిధులు కేటాయించాలని, పెండింగ్లో ఉన్న జనవరి, ఫిబ్రవరి నెలల పారితోషికాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించిన ఆశా కార్యకర్తల సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించి గ్లోబల్ లీడర్స్గా అవార్డు అందజేసిందని పేర్కొన్నారు. అయితే అనేక సేవలు అందిస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లుగా ఫిక్స్డ్ వేతనం ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ.18 వేల కనీస వేతనం అమలు కాలేదని, అలాగే రూ.50 లక్షల బీమా, మృతి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి హామీలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.


Comments