ఆర్డబ్ల్యూఎస్ ఏఈని సస్పెండ్ చేయాలి: పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ డిమాండ్
భీమదేవరపల్లి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):
భీమదేవరపల్లి మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. మండలంలో తాగునీటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ సంబంధిత అధికారి స్పందించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని పలు గ్రామాల్లో బోర్వెల్లు పనిచేయకపోవడం, పైప్లైన్లు దెబ్బతినడం, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు.
మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లినా ఏఈ సతీష్ అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమస్యలు వివరించడానికి వెళ్లినా స్పందన లేకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయనే కారణంతోనే ఏఈ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏఈ సతీష్ను సస్పెండ్ చేసి, మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పైడిపల్లి పృథ్విరాజ్ గౌడ్ కోరారు. గ్రామాల్లో బోర్లు, పైప్లైన్ల మరమ్మతులు చేపట్టి ప్రజలకు నిరంతర నీటి సరఫరా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.


Comments