విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి
పదో తరగతిలో 500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5000/- నగదు బహుమతి
-- వెల్టూర్ సర్పంచ్ అశోక్
పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, యువకులు కూడా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించిన ప్రతి విద్యార్థికి రూ. 5000/- రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.అదే విధంగా పరీక్షలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, షార్పనర్లు, స్కేలు, ప్యాడ్లు వంటి స్టేషనరీ సామగ్రిని కూడా విద్యార్థులకు బహుకరించారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి గ్రామ ప్రజాప్రతినిధులు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ప్రోత్సహించిన సర్పంచ్ , వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు యువకులకు పాఠశాల బృందం, విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Comments