ఎస్ ఎస్ సి పరీక్షల నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్లో 144 సెక్షన్ అమలు
_పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడడంపై నిషేధం
– జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు
మల్కాజిగిరి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):
పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కమిషనర్ అవినాష్ మహంతి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు.ఈ ఆదేశాల ప్రకారం పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ ఆంక్షలు మార్చి 14 ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 16 సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు, మిలిటరీ సిబ్బంది, హోమ్ గార్డులు, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వబడింది.
పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని 100 మీటర్ల పరిధిలో ఉన్న ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.నిబంధనలను ఉల్లంఘించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడడం లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరవడం వంటి చర్యలు చేపట్టినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.


Comments