యూరియా స్టాక్ పట్ల రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లాలో 13 వేల 795 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, రైతులు ఏలాంటి అపోహలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ , చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని, రైతులు అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం మొత్తం 13 వేల 795 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మార్క్ ఫెడ్ వద్ద 9,736 మెట్రిక్ టన్నులు, ప్యాక్స్ వద్ద 900 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్స్ వద్ద 663 మెట్రిక్ టన్నులు, గతంలో మన దగ్గర ఉన్న సి ఆర్ పి స్టాక్ 2495 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ అన్నారు. ప్రతి 2వేల ఎకరాల సాగు విస్తీర్ణానికి ఒక యూరియా సేల్ పాయింట్ ఉండే విధంగా చర్యలు చేపట్టామని, యూరియా కోసం రైతులు ఏ సమయంలో రావాలో వారికి ముందస్తుగానే సమాచారం అందిస్తూ కూపన్లు కూడా జారీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని, రైతులు అధికారులకు సహకరిస్తూ వారు సూచించిన సమయంలో వచ్చి యూరియా తీసుకుని వెళ్లాలని కలెక్టర్ తెలిపారు. ఒక రైతు అతని సాగు విస్తీర్ణానికి అవసరమైనయూరియా తప్పకుండా ఇస్తామని దానికంటే అధికంగా యూరియా తీసుకుని వెళ్లకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. రైతులు ఎవరు ప్రస్తుత అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి. పుల్లయ్య, జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్, మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ్ చంద్ర, చింతకాని తహసీల్దారు బాజ్జీ ప్రసాద్, నాగులవంచ పిఎసిఎస్ సీఈవో యాలముడి శ్రీనివాసరావు, ఏ ఈ ఓ దారగాని కల్యాణి సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments