వెనిజులాపై అమెరికా దురాక్రమణను వెంటనే నిలిపివేయాలి
సీఐటీయూ
కీసర, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
వెనిజులాపై అమెరికా చేస్తున్న దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తూ సీఐటీయూ కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు కీసరలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గృహకల్ప కాలనీ నుంచి 2బిహెచ్కే ఫేజ్-2 వరకు ఈ ర్యాలీ కొనసాగిందని సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం వెనిజులాపై సాగిస్తున్న దురాక్రమణ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గత కొన్ని వారాలుగా వెనిజులా చుట్టూ అమెరికా తన సైనిక, నావికా దళాలను మోహరించి బలవంతంగా అక్కడి ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.2025 డిసెంబర్ మొదటి వారంలో అమెరికా ప్రకటించిన జాతీయ భద్రతా వ్యూహం ద్వారా ఈ దురాక్రమణ ధోరణి స్పష్టంగా బయటపడిందన్నారు.పశ్చిమార్థగోళంలో అమెరికా సైన్యాన్ని మోహరించి మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ట్రంప్ జేమ్స్ మన్రో సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు.కరేబియన్ జలాల్లో మోహరించిన అమెరికా సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, వెనిజులాపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లాటిన్ అమెరికాను శాంతి జోన్గా ప్రకటించాలని, సార్వభౌమ దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు.అలాగే వెనిజులా అధ్యక్షుడు ముదురో భార్యను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ముదురో దంపతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వెనిజులాపై అమెరికా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యుఎన్ఎస్సి) తీర్మానం ప్రవేశపెట్టాలని, అమెరికాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని సీఐటీయూ పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో సీఐటీయూ కీసర మండల నాయకులు చింతకింది అశోక్, ఎస్. ప్రభాకర్, కుమార్, రాజేష్, భాస్కర్, అనురాధ, స్వరూప, లక్ష్మి, సంపావతి, పవిత్ర, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


Comments