ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంబంధిత శాఖలు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలు జరగేలా చర్యలు తీసుకోవాలని, సిజేరియన్ లు తగ్గించే దిశగా అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.
హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు, ఆర్బీఎస్కే, ఆరోగ్యశ్రీ, 108, టీహబ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డా. అ. అప్పయ్య జిల్లాలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులపై వివరాలు అందించారు. ఆర్బీఎస్కే బృందాలు స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలు, గుర్తిస్తున్న సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. గుర్తించిన రోగులకు ఫాలోఅప్ సేవలు అందించాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా, సి-సెక్షన్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య మహిళా క్లినిక్స్ నుంచి రిఫర్ అయిన గర్భిణులకు తగిన ఫాలోఅప్ నిర్వహించాలని, రక్తహీనత కలిగిన గర్భిణులకు అవసరమైన చికిత్స అందించాలన్నారు.టీబీ ముక్త అభియాన్లో భాగంగా ఐ-రిస్క్ గ్రూపుల సభ్యులకు స్క్రీనింగ్, ఎక్స్రే, నాట్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎన్సిడీ కార్యక్రమంలో గుర్తించిన బీపీ, షుగర్ రోగులు మందులు పద్దతిగా వాడుతున్నారా లేదో పర్యవేక్షించాలని, వారికి ప్రభుత్వ వైద్యం అందేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
పని పనితీరు తక్కువగా ఉన్న ఉపకేంద్రాల్లో పర్యవేక్షణ మెరుగుపర్చాలని, అధికారులు తమ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్ రావు, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, టీబీ అధికారి డాక్టర్ హిమబిందు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అఖిల్, 108 కోఆర్డినేటర్ డెమో అశోక్ రెడ్డి, వివిధ ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.
Comments