వర్షాలు సమృద్ధిగా కురవాలని మహిళల ప్రత్యేక పూజలు.
బొడ్రాయికి జలాభిషేకం.. దేవాలయాల్లో అభిషేకాలు, కోలాటాలతో ప్రార్థనలు.
భీమదేవరపల్లి, జూలై 3 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ మహిళలు వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
గ్రామంలోని మహిళలు బొడ్రాయికి బిందెల నీటితో జలాభిషేకం చేసి, వాన పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. రైతులకు మంచి పంటలు పండాలని, గ్రామంలో సుభిక్షం నెలకొనాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
అనంతరం గ్రామంలోని శ్రీ సాంబశివాలయం, పాత శివాలయంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శివలింగానికి జలదిగ్బంధం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శ్రీ విశ్వేశ్వర అయ్యప్ప స్వామి ఆలయం, పోచమ్మ దేవాలయం తదితర ఆలయాల్లో దేవతలకు అభిషేకాలు నిర్వహించి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని మహిళలు వేడుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు ప్రకృతి అనుకూలించి రైతాంగానికి మంచి దిగుబడులు రావాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు.


Comments