దళితుల జీవన హక్కులను కాలరాయొద్దు.
డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్.
ఎల్కతుర్తి, జూలై 3 (తెలంగాణ ముచ్చట్లు):
దండేపల్లి గ్రామ శివారులో ప్రతిపాదిత బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ప్లాంట్ నిర్మాణం పేరుతో దళితులు, పేద రైతుల జీవన హక్కులను కాలరాయవద్దని డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో పేదల జీవనాధారమైన భూములను స్వాధీనం చేసుకోవడం సమంజసం కాదన్నారు. దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూములను దశాబ్దాలుగా దళితులు, బీసీలు, పేద రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి భూములను బీపీసీఎల్ ప్లాంట్ కోసం స్వాధీనం చేసుకుంటే వందలాది కుటుంబాలు భూ నిర్వాసితులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడం అవసరమేనని, అయితే ఇప్పటికే భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల హక్కులను హరించడం సరైన విధానం కాదన్నారు. భూముల స్వాధీనానికి ముందు స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు, పునరావాసం, నష్టపరిహారం, జీవన భద్రతపై పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దళితుల భూములు, జీవన హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా డీహెచ్పీఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపట్టి బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని మారుపాక అనిల్ కుమార్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి శనిగరం రాజ్కుమార్, నాయకులు మంచాల రమ, తాండ్ర మొండయ్య, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments