పల్లె పాటకు ప్రాణం పోసిన సాయిచంద్కు ఘన నివాళి.
వనపర్తి, జూన్29(తెలంగాణ ముచ్చట్లు):
ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ సాయిచంద్ వర్ధంతిని సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో జైభీమ్ స్వచ్ఛంద సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, ప్రముఖ కవి జనజ్వాల, మహనీయుల స్పూర్తి వేదిక కన్వీనర్ గంధం నాగరాజు తదితరులు పాల్గొని సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పల్లె పాటకు ప్రాణం పోసి, తెలంగాణ సంస్కృతి, భాష, యాసను తన గానంతో ప్రపంచానికి చాటిచెప్పిన అరుదైన కళాకారుడు సాయిచంద్ అని కొనియాడారు. ఆయన ఆలపించిన ప్రతి పాటలో పల్లె సొగసు, మట్టి పరిమళం, రైతు జీవితపు కష్టసుఖాలు ప్రతిబింబించేవని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన గానం ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందన్నారు.ప్రముఖ కవి జనజ్వాల మాట్లాడుతూ సాయిచంద్ గొప్ప గాయకుడే కాకుండా నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషి అని అన్నారు.ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ, తన పాటల రూపంలో ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు.మహనీయుల స్పూర్తి వేదిక కన్వీనర్ గంధం నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సాయిచంద్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన పాటలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో జైభీమ్ స్వచ్ఛంద సేవా సంఘం సభ్యులు, సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Comments