చెత్తకు చెక్.. పచ్చదనానికి శ్రీకారం!
జమ్మికుంట టౌన్ జూన్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెత్త చెదారం వేస్తున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ మొక్కలు నాటించడం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రతపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
జమ్మికుంట పట్టణంలోని 30వ వార్డు పీఏసీఎస్ కార్యాలయం సమీపంలో చెత్త వేస్తున్న ఖాళీ స్థలంలో స్థానిక మహిళలతో కలిసి మొక్కలు నాటిన చైర్మన్, ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి వార్డులో చెత్త సేకరణ కోసం సూపర్ క్యారీ వాహనాలు, ప్రధాన రహదారులపై ట్రాక్టర్లు నిరంతరం తిరుగుతున్నప్పటికీ కొందరు ప్రజలు రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకే అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు, అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ప్రజలకు సూచించారు. చెత్త వేసే ప్రాంతాలను పచ్చని మొక్కలతో అందంగా తీర్చిదిద్దడం ద్వారా అలాంటి అలవాట్లకు స్వస్తి పలకాలని మున్సిపాలిటీ సంకల్పించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్లా నారాయణ, కటకం సంపత్, లెంకలపల్లి శరత్, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments