డీఎస్ఓ బదిలీతో సరిపోదు.. జైలుకు పంపాల్సిందే.
బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్.
వనపర్తి,జూన్28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాలో కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయానికి ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ను కేవలం బదిలీ చేయడం సరిపోదని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటూ జైలుకు పంపాలని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా కొనసాగుతున్న వ్యవస్థకు డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ వచ్చిన తర్వాతే అవినీతి మరకలు అంటుకున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు, కేటాయింపులు తదితర అంశాల్లో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడి వందల కోట్ల ప్రజాధనాన్ని అక్రమార్కులకు అప్పగించడంతో పాటు కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు.డీఎస్ఓ అవినీతి అక్రమాలపై బీసీ పొలిటికల్ జేఏసీ రాజీలేని పోరాటం సాగించిందని, ఆ ఒత్తిడితోనే అధికారులు ఆయనను కమిషనరేట్కు అటాచ్ చేశారని పేర్కొన్నారు.అయితే ఇది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని, బదిలీతో చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు.కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ అధికారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.జిల్లాలో ఏ అధికారి అవినీతికి పాల్పడినా బీసీ పొలిటికల్ జేఏసీ సహించబోదని, ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు సైతం అవినీతి, అక్రమాలకు పాల్పడితే వారిపైనా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.డీఎస్ఓ బదిలీతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి అండగా నిలిచిన జిల్లా ప్రజలకు డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Comments