కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం.
హుజూరాబాద్ నుంచి హెచ్చరిక!.
హుజూరాబాద్, జూన్ 30(తెలంగాణ ముచ్చట్లు ):
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్లో ప్రజారాజ్యం ఆర్మీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించే లేదా తీవ్రంగా గాయపడే కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికుల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని తక్షణమే పూర్తి చేసి వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంక్షేమ నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే జూలై 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని ప్రజారాజ్యం ఆర్మీ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, ప్రజారాజ్యం ఆర్మీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments