సేవకు గుర్తింపు.. జిల్లా బాధ్యతలతో శివన్నకు ఘన సన్మానం.
జమ్మికుంట, జూన్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు బచ్చు శివకుమార్ (శివన్న)ను బీజేపీ ఎండోమెంట్ జిల్లా జాయింట్ కన్వీనర్గా పార్టీ నియమించింది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన సన్మానం నిర్వహించి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ పట్ల బచ్చు శివకుమార్ చూపిన అంకితభావం, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల అభివృద్ధి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
ఎండోమెంట్ విభాగానికి సంబంధించిన అంశాల్లో బచ్చు శివకుమార్ అనుభవం జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
సన్మానానికి స్పందించిన బచ్చు శివకుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఎండోమెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేవాలయాల పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం, భక్తుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ, బచ్చు శివకుమార్ నియామకం జమ్మికుంటకు గర్వకారణమని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్, టంగుటూరి రాజ్కుమార్, సంపెల్లి సంపత్రావు, పొనగంటి రవికుమార్ (పీజేఆర్), యాంసాని సమ్మయ్య, సిరియాల విజయ్కుమార్, శ్రీనివాస్, మల్లికార్జున్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.


Comments