రియల్ ఎస్టేట్ అక్రమాలపై రెరా కన్నెర్ర .
38.63 లక్షల రూపాయల జరిమానా
విలేకరుల సమావేశంలో ఆర్.టి.ఐ కార్యకర్త రాము వెల్లడి
ఖమ్మం బ్యూరో,జూలై 3 (తెలంగాణ ముచ్చట్లు )
ప్రజల సొంత ఇంటి కలను ఆసరా చేసుకుని,అక్రమాలకు పాల్పడుతున్న రియల్
ఎస్టేట్ వెంచర్లపై అధికారులు కొరడా ఝలిపించారని, ఖమ్మం ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడిన ఇండో ఖతార్ యాజమాన్యానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) భారీ జరిమానా విధించిందని ఆర్.టి.ఐ కార్యకర్త ఎన్ .రాము తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ధర్మస్థలి, క్షేత్ర- 1, క్షేత్ర- 2, ధరణీ, ప్రణామం వంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు రెరా నిబంధనలను పాటించలేదని, తను ఆర్టిఐ ద్వారా ఫిర్యాదు చేయగా వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ యాజమాన్యం తప్పుడు విధానాలు అవలంబించడంతో రేర సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఇండో ఖతార్ మోసపూరితంగా వ్యవహరించడంతో యాజమాన్యానికి 38.63 లక్షల రూపాయల అపరాధ రుసుం విధించి నెల రోజుల్లోగా చెల్లించాలని రెరా ఆదేశాలు జారీ చేసినట్లు రాము తెలిపారు.
రెరా అనుమతులు పొందకుండా మార్కెటింగ్ చేయడం... మోసపూరిత ప్రకటనలు... అక్రమ అమ్మకాలు చేయడం పట్ల రేరా అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక రియల్ ఎస్టేట్ యాజమాన్యానికి ఇంత భారీ మొత్తంలో అపరాధ రుసుం వేయడం ఇదే ప్రధమం అన్నారు.
యాజమాన్య అక్రమాలపై గతంలో రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్టీఐ సభ్యులు ఎన్ .రాము పేర్కొన్నారు. కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామ పరిధిలో . కాలువ ఆక్రమణకు గురి అయిందని రెవిన్యూ అధికారులు నిర్ధారించినా... స్వాధీనం చేసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రెవిన్యూ యంత్రాంగం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అక్రమాలను నిరోధించాలని విజ్ఞప్తి చేశారు.


Comments